పద్మనాభ స్వామి ఆలయానికి భారీ భద్రత
నిఘా కోసం అత్యాధునిక పరికరాలను అమర్చుతారు. నిరంతర అప్రమత్తతతో రక్షణ విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక పోలీస్ దళాన్ని వినియోగిస్తారు. భద్రతాపరంగా ఎన్ని చర్యలు తీసుకొన్నా భక్తులకు, ఆలయ సంప్రదాయాలకు ఎలాంటి ఆటంకం కలగనీయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము ఖరారు చేసిన ఈ ప్రణాళికను త్వరలో రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కె.జయకుమార్ ద్వారా సుప్రీంకోర్టుకు నివేదిస్తామన్నారు. ఆరో గదిపై అందరిచూపు:పద్మనాభ ఆలయ రహస్య నేలమాళిగలోని ఐదు గదుల్లోని సంపద లెక్కింపు, జాబితా తయారీ స్వల్ప అవరోధాలు మినహా దాదాపు సాఫీగా కొనసాగింది. కానీ ఆరో గదిని తెరవటంపై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆ గది ద్వారాలు తెరవటం అత్యంత క్లిష్టమైన ప్రకియతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం కలుగుతుందన్న అపోహలూ స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.
ఇప్పటివరకూ వెలుగుచూసిన సంపద విలువ రూ.లక్ష కోట్లని అనధికారిక అంచనా. ఆరో గదిలో ఇంతకు కొన్ని రెట్లు అధికంగా సంపద ఉండవచ్చని వూహిస్తున్నారు. ఆరో గది తెరవటానికి సంబంధించి శుక్రవారం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశముంది. దీనిని తెరిచేందకు తొందరపాటు తగదని సుప్రీంకోర్టు నియమిత పరిశీలకుల బృందం అభిప్రాయపడటంతో గురువారం వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి ద్వారంపై సర్ప ఆకృతి చెక్కి ఉంది. దీనిని తెరిస్తే వరద వస్తుందని, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని రకరకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆరో గది నుంచి సమీపంలోని సముద్రం వరకూ ఓ రహస్య మార్గం ఉందనేది స్థానికుల మరో విశ్వాసం. రాజవంశీకులు కూడా ఈ ద్వారాన్ని కదిలించవద్దనే చెబుతున్నారు.