తెలంగాణపై ఆజాద్ నోట లగడపాటి మాటలు
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరగదు కాబట్టి తెలంగాణ రాదని ఆజాద్ అనకపోయినప్పటికీ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం కావాలని ఆజాద్ మంగళవారంనాడు అన్నారు. అలాంటి తీర్మానం జరగదనే విషయం ఆజాద్కు తెలియంది కాదు. శానససభలో సీమాంధ్ర శాసనసభ్యులకు మెజారిటీ ఉంటుంది. అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం జరిగే అవకాశం లేదు. అయితే, ఆజాద్ ప్రకటనపై తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటుకు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానిపై శానససభ అభిప్రాయాన్ని కేంద్రం కోరితే చాలు. శానససభ అభిప్రాయం రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నా, సానుకూలంగా ఉన్నా కేంద్ర నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. రాజ్యంగపరంగా కేంద్రానికి ఆ హక్కు సంక్రమించింది. దీని గురించే తెలంగాణ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు.
కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. దాన్ని విడనాడాలని తెలంగాణ నాయకులు కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయగానే దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినా పట్టించుకోవడం లేదు. ఇది కూడా కాంగ్రెసు అధిష్టానం పక్షపాత వైఖరిని బయటపెడుతోందనే అభిప్రాయం ఉంది. శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం సమస్యను మళ్ల మొదటికి తెచ్చింది.
అయితే, పది రోజుల్లో మూడు ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్య పరిష్కారానికి ముందుకు వస్తున్నట్లు సంకేతాలు అందించిన మర్నాడే ఆజాద్ ఆలాంటి ప్రకటన చేయడం వెనక సీమాంధ్ర నాయకుల ఒత్తిడి ఉందా, తెలంగాణ నాయకులనూ ప్రజలనూ రెచ్చగొట్టే ఉద్దేశం ఉందా అనేది తేలడం లేదు. అయితే, కాంగ్రెసు ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి మాత్రం సంప్రదింపులు ప్రక్రియను కాంగ్రెసు ఇప్పటికే మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు.