హైకోర్టు తీర్పుతో వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారా?
2జి కుంభకోణంలో ఇరుక్కున కనిమొళి డిఎంకెకు సంబంధించి టీవీలోకి రూ.200 కోట్లు అప్పుగా మాత్రమే వచ్చాయని, వాటిని మళ్లీ తీర్చామని పత్రాలు చూపించినప్పటికీ ఆమె జైలు పాలు కాక తప్పలేదు. తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ అనామక కంపెనీలను సృష్టించి వాటి ద్వారా సాక్షి, భారతీ, సండూరు ప్రాజెక్టులలోకి భారీగా పెట్టుబడులు తరలించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఆయన నిరూపించుకోవడం అంత సాధారణ విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే జగన్ వర్గం నేతలు కాంగ్రెసు పార్టీపై ఎదురు దాడికి దిగుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దర్యాఫ్తును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జగన్పై సిబిఐ దర్యాఫ్తుకు నిరసనగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ గురువారం పంజాగుట్ట చౌరస్తాలో నిరసన తెలిపింది. జగన్పై సిబిఐ దర్యాఫ్తు జరుగుతుందని ముందే తాము ఊహించామని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రారావు అన్నారు. ఇదంతా కాంగ్రెసు కుట్ర అని ఆరోపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ది తోలు బొమ్మలాటలో పోలిగాడి పాత్రలా ఉందని విమర్శించారు. వైయస్సాఆర్ హయాంలో మంత్రులుగా ఉన్న వారిని సైతం భాగస్వాములు చేయాలని మరికొందరు జగన్ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిలో వైయస్ పాత్ర ఉంటే వారి పాత్ర సైతం ఉంటుందని వారు అంటున్నారు.