పివికి కాంగ్రెసు పెద్దల అవమానం, మళ్లీ వివాదం
ఆదివారం ఢిల్లీలోని హాబిటేట్ సెంటర్లో నిర్వహించిన '24 అక్బర్ రోడ్' పుస్తకావిష్కరణ సభ పివికి జరిగిన అవమానాన్ని చర్చనీయాంశం చేసింది. సోనియా గాంధీ జీవిత చరిత్ర రాసిన పాత్రికేయుడు రషీద్ కిద్వాయ్ ఈ పుస్తక రచయిత. '24 అక్బర్ రోడ్'... ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్బారు, పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గౌరవం దక్కలేదని రాజ్దీప్ సర్దేశాయ్ తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు. కొద్దినెలల పాటే ప్రధాని పదవిలో ఉన్న చరణ్సింగ్, చంద్రశేఖర్ల మరణానంతరం వారి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించారని, వారి స్మృతి చిహ్నాల నిర్మాణానికీ స్థలం కేటాయించారని పీవీ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని అన్నారు.
ఆయనకు దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్లు అడ్డుతగిలారు. పీవీ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకెళ్లాలన్నది ఆయన కుమారుల నిర్ణయమేనని తెలిపారు. వేదికపైనే ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు జోక్యం చేసుకొంటూ - ''2004 డిసెంబరు 23 పీవీ మృతి చెందిన రోజు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకెళ్లమని పీవీ కుమారులకు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి నా సెల్ఫోన్కు సందేశం వచ్చింది. నేను ఆ సమాచారాన్ని వారికి చేరవేశాను. తండ్రి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించాలా అని తీవ్రతర్జన భర్జనపడ్డారు. చివరకు ఆ విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్నే ప్రకటించమన్నారు'' అని వెల్లడించారు. అయితే సంజయ్బారు తనకు సందేశం పంపిన నాయకుల పేర్లు వెల్లడించలేదు.