తెలంగాణపై కాంగ్రెసు చేతులెత్తేసి బాబు వైపే వేలు
ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే తప్ప సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేనట్లు కేంద్ర ప్రభుత్వానికి గానీ కాంగ్రెసు అధిష్టానానికి గానీ లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణపై ఒప్పందం చేసుకుని 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన కూడా తెలంగాణ అంశం మొదటి వచ్చినట్లే మాట్లాడుతున్నారు. పైగా, తెలంగాణ నాయకులు, ప్రజల మనోభావాలను పట్టించుకోవడానికి గానీ తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలను గుర్తించడానికి గానీ ఆయన సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు.
తెలంగాణ ప్రజల మనోభావం కాంగ్రెసు అధిష్టానానికి, కేంద్రానికి పట్టలేదని అర్థమవుతోంది. తమ పార్టీలో తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరకపోవడాన్ని అన్ని పార్టీలకూ రుద్దుతోంది. పార్లమెంటులో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గింది. ఏ అంశం మీదనైనా ఓ రాజకీయ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి ఉంటుంది. కాదనో, అవుననో తేటతెల్లం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే, పార్టీకి ఏర్పడే ముప్పునకు కాంగ్రెసు అధిష్టానం భయపడుతోంది. అలా భయపడి తెలంగాణ ప్రాంతాన్నే కాదు, రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకుంటే, చంద్రబాబు తేల్చుకుంటారా లేదా అనేది తర్వాత తేలుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెసు అధిష్టానం ఓ జాతీయ పార్టీగా తన వైఖరిని ప్రదర్శించాని అన్ని వైపుల నుంచీ డిమాండ్ వస్తోంది. దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబుపై వేలెత్తి చూపి తప్పుకోవడానికి చూస్తోంది.