రైతులకు బంపర్ ఆఫర్.. రూ. వందకే వారసత్వ ఆస్తి బదిలీ!
"గత పాలకుల దుర్మార్గపు నిర్ణయాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే నల్ల చట్టం ద్వారా రైతుల భూములను కాజేసేందుకు జరిగిన కుట్రలను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాశ్వతంగా సమాధి చేసిందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలు పంపిణి చేశారు. రైతుల భూములకు నూటికి నూరు శాతం యాజమాన్య హక్కులను కల్పిస్తూ, కరెన్సీ నోట్లకు ఉండే స్థాయి భద్రతా ఫీచర్లు, రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని రైతులకు వివరించారు, స్పష్టం చేశారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలు పచ్చదనంతో అలరారుతూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని ముఖ్యమంత్రి కొనియాడారు. "బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రికార్డుల వల్ల ఏపీలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి. కానీ, గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో రికార్డులను తారుమారు చేసి, ప్రైవేటు సంస్థలకు అప్పగించి గందరగోళం సృష్టించారు. భూమి రైతులదైతే.. పాస్ పుస్తకాలు, పొలం సరిహద్దు రాళ్లపై మాత్రం నాటి పాలకుడి బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజాధనం రూ.800 కోట్లు తగలేసి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు" అని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చేసిన ఈ దుర్మార్గాన్ని సరిదిద్ది, భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి తమ ప్రభుత్వానికి మూడేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'రీ-సర్వే 2.0'.. వెబ్ల్యాండ్ 2.0తో సరికొత్త విప్లవం
- భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులను భాగస్వాములను చేస్తూ, వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాతే తప్పులు లేని పాస్ పుస్తకాలను ముద్రిస్తున్నామన్నారు.
- ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి, 26.46 లక్షల మందికి పాస్ పుస్తకాలు అందజేశామని, మిగిలిన 62.32 లక్షల పుస్తకాలను నిర్దేశిత గడువులోగా పంపిణీ చేస్తామని, మొత్తం 90 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.
- వారసత్వ ఆస్తుల బదిలీని సులభతరం చేస్తూ.. రూ.10 లక్షల లోపు ఆస్తులకు కేవలం రూ.100 లకే బదిలీ సౌకర్యం కల్పించామని, అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తులకు కేవలం రూ.1,000 స్టాంప్ డ్యూటీ సరిపోతుందని సీఎం స్పష్టం చేశారు.
- వారసత్వ, అమ్మకం, బహుమతి లాంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ విధానాన్ని తెచ్చామని, వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు, ట్రాకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. అంతేకాకుండా, దరఖాస్తుల తిరస్కరణ అధికారాన్ని తహసీల్దార్ల నుంచి ఆర్డీఓ స్థాయికి పెంచి పారదర్శకత పెంచామన్నారు.
గొడ్డలి పార్టీలాగా దిష్టి బొమ్మ మొఖాలు కాదు..
— Telugu Desam Party (@JaiTDP) June 8, 2026
మీ భూమి.. మీ తాత ఇచ్చిన భూమి.. మీ నాన్న ఇచ్చిన భూమి.. అది మీ ఆస్తి.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మీకు పట్టాలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం.. #PattadarPassbooks #FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu… pic.twitter.com/18VhB1WN6p
శెట్టిపల్లి వివాదం పరిష్కారం.. 22ఏ నుంచి విముక్తి
చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో నలిగిన శెట్టిపల్లి గ్రామ భూముల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించి హక్కుదారులకు అప్పగించిందని సీఎం గుర్తుచేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను, 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతులు గల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తప్పించి హక్కుదారులకు పూర్తి స్వేచ్ఛను కల్పించామని ప్రకటించారు.
24 గంటల్లోనే ధాన్యపు డబ్బులు.. ఆక్వా రంగానికి అండ
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్తూ, 'అన్నదాత సుఖీభవ' పథకం కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశామని, కేంద్ర సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నామని సీఎం వివరించారు. "గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోడ్లెక్కి నిరసనలు చేయాల్సి వచ్చేది, డబ్బుల కోసం 6 నెలలు వేచి చూసేవారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం" అని స్పష్టం చేశారు.
గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఆక్వా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దాణా రేట్లు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతులకు ఊరటనిచ్చేలా సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భరోసా ఇచ్చారు.
10 లక్షల కోట్ల అప్పులు.. కూటమి ప్రభుత్వ సుపరిపాలన
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని, జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని సీఎం మండిపడ్డారు. అయినప్పటికీ, ఎన్డీఏ కూటమి ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలన అనే త్రిసూత్ర నినాదంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించడమే తమ సంకల్పమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.














Click it and Unblock the Notifications