Bengaluru Roads:ఐటీ సిటీలో టన్నెల్ రోడ్లు - బెడిసికొట్టిన సీఎం డీకేశీ ప్లాన్..?
ఒకప్పుడు "ఇండియా సిలికాన్ వ్యాలీ"గా ప్రపంచాన్ని ఆకట్టుకున్న బెంగళూరు.. ఇప్పుడు రోడ్ల దుస్థితితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఐటీ హబ్గా, ఆధునిక జీవనశైలికి కేంద్రంగా పేరొందిన ఈ మహానగరం.. వర్షం పడితే చాలు ప్రజలకు భయానక నగరంగా మారుతోంది. గుంతల రోడ్లు, మునిగిపోయే అండర్పాస్లు, అంతం లేని ట్రాఫిక్, ఎప్పటికీ పూర్తి కాని ఫ్లైఓవర్లు.. ఇవన్నీ కలసి బెంగళూరును ప్రజలకు నరకయాతనగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదిస్తున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
బెంగళూరులో 17 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు సీఎం డీకే శివకుమార్ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.18 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ నగరానికి ఉపయోగమా..? లేక మరింత సమస్యలకా కారణమవుతుందా..? అనే సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే నగరంలోని మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోతున్న ప్రభుత్వం.. ఇంత భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.పర్యావరణ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు ఈ సొరంగ మార్గ ప్రాజెక్టుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి.

ప్రజావ్యతిరేక పనుల జోలికి వెళ్లని సిద్ధరామయ్య
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా వ్యతిరేకత ఎదురైన కొన్ని భారీ ప్రాజెక్టులను పక్కన పెట్టారు. కానీ డీకే శివకుమార్ మాత్రం పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన దృష్టి వ్యాపారాభివృద్ధి, ఆధునిక నగర నిర్మాణం వైపే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ తరహాలో బెంగళూరును మార్చాలన్న లక్ష్యంతో డీకే ముందుకెళ్తున్నప్పటికీ.. నేలమీద వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
వర్షం వస్తే చాలు.. రోడ్లన్నీ బురదమయం
హెబ్బాల్ జంక్షన్ను ఎన్నిసార్లు మార్చినా ట్రాఫిక్ సమస్య అలాగే కొనసాగుతోంది. వర్షాలు పడితే అండర్పాస్లు ప్రమాదకర మరణ ఉచ్చులుగా మారుతున్నాయి. కేఆర్ సర్కిల్ ఘటనను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. వర్షాకాలం వస్తే ఆ ప్రాంతాన్ని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రాథమిక సమస్యలనే పరిష్కరించలేకపోతున్న వ్యవస్థ.. ఇప్పుడు మళ్లీ సొరంగ మార్గాలపై ఆధారపడటం ప్రజలకు ఆశ్చర్యంగా మారింది.
కోరమంగల-ఈజిపుర ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పదేళ్లుగా సాగుతూనే ఉంది. కేవలం 2.4 కిలోమీటర్ల పొడవున్న ఫ్లైఓవర్కే ఇంత సమయం పట్టడం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అవినీతి ఆరోపణలు కూడా తరచూ వినిపిస్తున్నాయి. డబ్బులు ఖర్చవుతున్నాయి కానీ పనులు మాత్రం పూర్తి కావడం లేదు.ఇక మైసూరు రోడ్ సమీపంలోని బిడదిలో కొత్త టౌన్షిప్ నిర్మించాలన్న డీకే శివకుమార్ ప్రణాళిక రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.బెంగళూరు-మైసూరు మధ్య మరో ఎక్స్ప్రెస్వే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.కానీ ఇప్పటికే ఉన్న రోడ్ల సమస్యలే పరిష్కారం కాని పరిస్థితి నెలకొంది.
మరమ్మత్తులకు కోట్లు ఖర్చుచేసినా..
రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించినప్పటికీ.. గతంలో కూడా ఇలాగే వేల కోట్లు ఖర్చు చేసినా గుంతలు మాత్రం యథాస్థితికి చేరుకున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇతర నగరాల్లోని ప్రధాన రోడ్లపై ప్రయాణించిన వారు బెంగళూరులోకి అడుగుపెడితే.."ఇది మెట్రో నగరమా లేక గ్రామీణ రహదారులా?" అనే అనుమానం కలుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అత్యాధునిక జీవనశైలి, చల్లని వాతావరణంతో విదేశీ నగరాలకు పోటీ ఇస్తున్న బెంగళూరు.. రోడ్ల విషయానికి వస్తే మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో బెంగళూరు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు పెద్దగా మార్పులు తీసుకురాలేకపోయిన డీకే శివకుమార్.. ఇప్పుడు మాత్రం నగరాన్ని పూర్తిగా మార్చేస్తానని చెప్పడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.రాగిగుడ్డ-సిల్క్బోర్డ్ ఫ్లైఓవర్ మినహా చెప్పుకోదగ్గ విజయాలు లేవన్న అభిప్రాయం కూడా బలపడుతోంది.
ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు.. మౌలిక సదుపాయాల లోపంతో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. భారీ ప్రాజెక్టులు ప్రకటించడం ఒక్కటే కాకుండా.. ఇప్పటికే ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.














Click it and Unblock the Notifications