స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
హైదరాబాద్లో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం జంటనగరాల్లో కురుస్తూనే ఉంది. చిరుజల్లులతో ప్రారంభమై కుండపోతగా మారిన వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. అమీర్పేట, మూసాపేట, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. బేగంపేట, పంజాగుట్ట, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షం వల్ల రోడ్డు పూర్తిగా జలయమయ్యాయి. ఉప్పల్, రామాంతపూర్లోని ఇందిరానగర్, గోఖలేనగర్ ప్రాంతాల్లో లోతట్లు ప్రాంతాలు జలయమయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి మండలంలో భారీ వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎస్ మండలం తెట్టెకుంటతండాలోనూ రామన్నగూడెం వాగు పొంగుతోంది. దీంతో తండాచుట్టూ వరదనీరు చేరడంతో గిరిజనులు ఆందోళనలో ఉన్నారు. నసీంపేటలోని వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురిని స్థానికులు బయటకు తీసి రక్షించారు. సూర్యాపేటలోనూ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలోనూ పలుప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.