తెలంగాణకోసం మెడపై కత్తి పెట్టాలి: కెసిఆర్
తెలంగాణ నేతల్లో వచ్చిన ఐక్యతను దెబ్బ తీసేందుకు ఆంధ్రా నేతలు మరోసారి కుట్ర పన్నుతున్నారన్నారు. నేతల మధ్య చిచ్చు పెట్టేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలన్నారు. మన ఐక్యకే మనకు శ్రీరామ రక్ష అన్నారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ రాజీనామాలు తిరస్కరించడం రాజ్యాగ విరుద్దమన్నారు. రాజీనామాల తిరస్కరణ రాజకీయ కుట్ర అన్నారు. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిందన్నారు. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు మెడమీద తలకాయ లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సకల జనుల సమ్మెకు సిద్ధమైన తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ తొలగించకుండా ఎస్ఐ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని అది ఎంత వరకు సమంజసం అన్నారు. సిఎం మొండికి పోయి పరీక్షలు నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు.
14ఎఫ్ తొలగించిన తర్వాతే పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి తన మూర్ఖపు వాదన మానుకోవాలన్నారు. కావూరి అపహాస్యం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ శతాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రంగా ఉందని, కానీ కృష్ణా జిల్లా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రంగా లేదన్నారు. ఆంధ్రా పాలనలో సింగూరు ప్రాజెక్టుకు చుక్క నీరు రాలేదన్నారు. కాగా జూలై నాలుగో తారీఖున కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులకు పోటీగా రాజీనామాలు సమర్పించిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలు మరోసారి ఇచ్చేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం వేరుగా అన్నారు. సీమాంధ్ర పాలకులకు పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై లేదని ఆరోపించారు.