మత్తుమందు ఇచ్చి వారం రోజుల పాటు గ్యాంగ్ రేప్
మొదటి కేసులో, 18 సంవత్సరాల ఈ బాలికను జూలై 19న కొంతమంది యువకులు ఘజియాబాద్ లోని విజయనగర్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. ఆమెను సుమారు వారం రోజులపాటు మత్తులో వుంచి అందరూ కలసి ఆమెను హరిద్వార్, ఢిల్లీలలోని వివిధ ప్రాంతాలకు తీసుకుపోయి మూకుమ్మడిగా మానభంగం చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. అత్యాచారం చేసిన తర్వాత దుండగులు ఆమెను ఘజియాబాద్ లోని ఆమె ఇంటిముందు జూలై 25వ తేదీన వదిలి పారిపోయారు. ఆమెకు అత్యధికంగా మత్తు మందులు ఇచ్చారని, తెలివి వచ్చిన తర్వాత ఆమె జరిగిన కధ అంతా వివరించిందని పోలీసులు తెలుపుతున్నారు. వైద్య పరీక్షలు మాన భంగాన్ని ధృవపరిచాయి.
ఇదే విధంగా, గత వారంలో మరో 16 ఏళ్ళ బాలికను హాపూర్ సిటీనుండి కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకువచ్చికొంతమంది దుండగులు ఆమెను అనేక మార్లు మానభంగం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ బాలికను మానభంగం తర్వాత దుండగులు ఢిల్లీలోని నేషనల్ కమీషన్ ఫర్ వుమన్ కార్యాలయం ముందు ఈ నెల 23వ తేదీన స్పృహ లేని స్ధితిలో వదిలేశారు. వైద్య పరీక్షలలో మానభంగం నిర్ధారణ అయిన తర్వాత ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను హాపూర్ కు పంపి వేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రఘువీర్ లాల్ తెలిపారు.