సిడబ్ల్యుజి స్కామ్, చిక్కుల్లో ప్రదాని కార్యాలయం
పీఎంవోపై కాగ్ చెప్పిన విషయాలు -
- కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో ఏకీకృత అధికారం, బాధ్యత లేకుండా చేశారు.
- 2003 మేలో కామన్వెల్త్ క్రీడల నిర్వహణ అవకాశం కోసం భారత్ దరఖాస్తు చేసింది. నిర్వాహక కమిటీ(ఓసీ)ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, అధ్యక్షుడిని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు. భారతీయ ఒలింపిక్ సంఘం(ఐవోసీ) అధ్యక్షుడు(కల్మాడీ) ఉపాధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు.
- 2003 డిసెంబరులో అదనపు సమాచారంతో రూపొందించిన బిడ్ను రూపొందించారని, దాని ప్రకారం ఓసీని ప్రైవేటు రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పాటు చేస్తున్నామని, కల్మాడీని ఓసీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నామని ఐవోసీ 2004 సెప్టెంబరులో ప్రకటించింది. అప్పటికి బిడ్ దక్కి పదినెలలు అయ్యింది. వాళ్లు చెబుతున్న పత్రానికి ఎలాంటి చట్టబద్ధత లేదు.
- 2004 డిసెంబరు 6న ప్రధాని కార్యాలయం సంబంధిత శాఖలకు లేఖ రాసింది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు వ్యవస్థాగత ఏర్పాట్లు చేశామని, కల్మాడీ నేతృత్వంలో ఓసీ ఏర్పడనుందని చెప్పింది.
- 2005 జనవరి 14న మంత్రుల గ్రూపు సమావేశమైనపుడు వ్యవస్థాగత ఏర్పాటు ఎలా ఉండాలనే నిర్ణయం తీసుకోలేక పోయారు. మరో రెండు వారాల తర్వాత మరోసారి సమావేశమైనపుడు పీఎంవో నిర్ణయానికి తలొగ్గారు.
- ఫిబ్రవరిలో ఓసీ ప్రభుత్వంతో సంబంధం లేని రిజిస్టర్డ్ సొసైటీగా ఏర్పడింది. కల్మాడీ అధ్యక్షుడయ్యారు. 400 మందితో జంబో నిర్వాహక కమిటీ ఏర్పడింది. అది కేవలం అలంకారప్రాయం.
- ఓసీ ప్రైవేటు సొసైటీగా ఏర్పడటంతో ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఖర్చుల విషయంలో ఔచిత్యం, పారదర్శకత గురించి ప్రశ్నించే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. నిజానికి ఈ క్రీడలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా, ఆర్థికంగా పూచీకత్తుగా కూడా ఉంది.
- 2007లో క్రీడామంత్రి మణిశంకర్ అయ్యర్ ఓసీపై తమకు నియంత్రణ లేకుండా పోయిందని పీఎంవో నుంచి మంత్రివర్గ కమిటీ వరకు అన్ని వేదికల వద్దా ప్రస్తావించారు. ఫలితం లేకపోయింది.
- 2003 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి ఆతిథ్యనగరం ఏర్పాట్లపై ఇచ్చిన హామీల వల్లే కామన్వెల్త్ క్రీడల అవకాశం దక్కిందనేది మరువరాదు. ఈ క్రీడలు జాతి సొత్తు. ఓసీ నియామకంలో కేంద్రం ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోలేదు.
- ప్రభుత్వమే హామీదారుగా ఉన్నందున క్రీడా ప్రాజెక్టులన్నింటిపైనా కేంద్రీకృత పర్యవేక్షణ పెట్టాల్సింది.