జయ పగ, అళగిరి భార్య అరెస్టుకు సన్నాహాలు?
మదురై: డిఎంకె నేత కరుణానిధి కుటుంబ సభ్యులను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వదిలేట్లు లేరు. భూకబ్జా కేసులో డిఎంకె నేత అళగిరి భార్య కాంతి అళగిరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేసినట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఓ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయ భూమిని కబ్జా చేశారనే ఆరోపణపై దయా సైబర్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి అళగిరిపై చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు వర్గాలు చెప్పాయి.
మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సమీపంలో గల ఆలయానికి సంబంధించిన పలు ఎకరాలను కాంతి కబ్జా చేసినట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదు అందింది. ఆలయ పూజారి సుబ్రమణ్య అయ్యర్ ఆ పిటిషన్ను దాఖలు చేశారు. ఆలయానికి 1936 సంక్రమించిన భూమిని తొలుత శాంటిగో మార్టిన్కు విక్రయించి, ముఖ్య అనుచరుల ద్వారా కాంతికి అప్పగించారని ఆయన ఆరోపించారు.
ఫిర్యాదుపై సమాచారం సేకరిస్తున్నామని, నేరానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరిస్తున్నామని, సాక్ష్యాలు ఉంటే కేసు నమోదు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, తమ కుటుంబ సంపదపై తప్పుడు వార్తలు రాస్తున్నాయంటూ కేంద్ర మంత్రి ఎంకె అళగిరి ఆదివారంనాడు మీడియాపై విరుచుకుపడ్డారు. తప్పుడు వార్తలపై రాసిన మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. చట్టబద్దంగానే తమ కుటుంబ సభ్యులు సంపాదించారని, అందులో ఏ విధమైన అక్రమాలు లేవని ఆయన అన్నారు.