అందుకే జగన్ను వైయస్ బెంగళూర్ పంపారు: లగడపాటి
ప్రాథమిక ఆధారాలున్నాయని చెప్పి జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిందని, ఇందులో కాంగ్రెసు పాత్ర ఏమీ లేదని, కోర్టు చాలా మంది మీద సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని ఆయన అన్నారు. హైకోర్టును శంకించే విధంగా వైయస్ జగన్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను కూడా కుట్రగా మాట్లాడడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ఆయన అన్నారు. బిజెపికి వైయస్ జగన్ ముసుగు అని, జగన్ బిజెపి ఏజెంటుగా పనిచేస్తున్నారని, జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా బిజెపి నాయకులు పార్లమెంటులో బల్లలు చరచడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి జీవించినప్పుడే జగన్పై చాలా అభియోగాలు వచ్చాయని, గత ఐదేళ్లలో జగన్ ఆస్తులు పెరిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెసును విమర్సిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు చెట్టుకు చెందిన విషపు కొమ్మ జగన్ అని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు విషపు పురుగా, కాంగ్రెసు విషపు వృక్షమో చెప్పాలని ఆయన అన్నారు. కాంగ్రెసు నీడలోనే చంద్రబాబు పెరిగారని ఆయన అన్నారు. అనుభవం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి చెప్పినట్లు జగన్కు చెప్పారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులతో, జగన్తో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని ఆయన అన్నారు.