జగన్ ఆస్తుల కేసులో మూకుమ్మడి అరెస్టులు?
జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన కేసులో మొత్తం 74 మంది నిందితుల్ని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కంటే సంస్థల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ సంస్థపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు లభించే పక్షంలో సంస్థ బాధ్యుల్ని అరెస్టు చేయొచ్చు. అంటే ఇప్పుడు సంస్థలున్న స్థానంలో భవిష్యత్తులో వ్యక్తులొచ్చి చేరే అవకాశం ఉంది. అలాగే పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధుల్నీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న అధికారులందర్నీ అరెస్టు చేయొచ్చు. అయితే చట్టపరంగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆధారాలు లభించిన వారిని మాత్రమే అరెస్టు చేస్తారు. చట్టపరంగా పాటించాల్సిన నిబంధనలు, వాటిని ఉల్లంఘించిన తీరు బేరీజు వేయడానికి రెండు కేసులూ అనువుగానే ఉన్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. పైగా ఈ ఉల్లంఘనలు అన్నీ రికార్డుల్లో నమోదై ఉంటాయి.
పెట్టుబడులు పెట్టడం, భూములు కేటాయించడం, ప్రతిఫలం పొందటం వంటివన్నీ ప్రభుత్వ రికార్డులతోపాటు వివిధ ఇతర ప్రభుత్వ విభాగాల్లోనూ లభిస్తాయని, వాటిని సేకరించి విశ్లేషిస్తే ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయి, ఇందుకు బాధ్యులెవరన్న విషయం వెల్లడవుతుందని ఆయన విశ్లేషించారు. ఉదాహరణకు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన దాదాపు 30కిపైగా కంపెనీలు ఉనికిలో లేవని వార్తాకథనాల సారాంశం. గతంలో ఆదాయపుపన్ను శాఖ రూపొందించిన నివేదికలోనూ దీన్ని పేర్కొన్నారు. కేవలం చిరునామా మాత్రమే ఉన్న ఈ సంస్థలు జగన్ కంపెనీల్లో రూ.కోట్లు ఎలా పెట్టుబడులు పెట్టాయన్న దానిపై సీబీఐ దృష్టి సారించింది.
కాగా, జగతి పబ్లికేషన్స్ కంపెనీ సెక్రెటరీ కార్తీక్ నరసింహన్ను సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని దిల్కుష్ అతిథిగృహానికి రప్పించి వివిధ కోణాల్లో ప్రశ్నించారు. షేర్ల కేటాయింపు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.