వైయస్ జగన్కు సుప్రీంలోనూ షాక్, పిటిషన్ తిరస్కరణ
జగన్ తరఫున రాం జెఠ్మలానీ, ముకుల్ రోహత్గీ వాదించగా, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు తరఫున గంగూలీ అనే న్యాయవాది వాదించారు. కాగా అంతకు ముందు వారు అంతకుముందు రాం జెఠ్మలానీ సిబిఐ పూర్తి విచారణకు ఆదేశించిన హైకోర్టు తీర్పును ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంలో హైకోర్టు ఆదేశాలు ప్రాథమిక న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. సిబిఐ ప్రాథమిక నివేదిక చూడకుండానే పూర్తి విచారణకు ఆదేశించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దమన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ సిబిఐ ప్రాథమిక నివేదికను తమకు చూపించలేదన్నారు. వీధిలో పోరాడాల్సిన రాజకీయ పార్టీలో జగన్పై కోర్టులో పోరాడుతున్నాయన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకే తాను హైకోర్టుకు లేఖ రాసినట్లు మంత్రి శంకర్ రావే చెప్పారన్నారు.
జగన్పై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. అధిష్టానం ఆదేశాల మేరకే మంత్రి శంకర్ రావు లేఖ రాసినట్లు చెప్పారన్నారు. విచారణ పూర్తి కాకముందే అక్రమాలు ఉన్నాయని హైకోర్టు చెప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు. క్రిమినల్ మాటర్ పిల్స్ విచారించరాదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ఎర్రన్నాయుడు తరఫు న్యాయవాది మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ నడుచుకుంటుందని చెప్పారు. కాగా ఈ వాదనలు సుమారు రెండు గంటల పాటు సాగాయి. కాగా జగన్ తన పిటిషన్లో తన కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చినట్లుగా అంగీకరించారు.