వైయస్ జగన్పై దండెత్తిన టిడిపి, కాంగ్రెసు నేతలు

తప్పు చేయనప్పుడు జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. జగన్ అవినీతికి సంబంధించి ఏ సమాచారమైనా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐ చేపడుతున్న దర్యాప్తుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించాడనే అభియోగంపై హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. ఆరోపణలు వస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని వై.ఎస్ అనేవారని ఆ తండ్రికి కొడుకై ఉండి విచారణకు ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలమేరకు సీబీఐ దర్యాప్తుచేస్తుంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎవరిపై ధర్మయుద్ధం చేస్తున్నారని ప్రశ్నించారు. వారి రాజీనామాలవల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.
వైయస్ జగన్ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని కాంగ్రెసు విప్ కొండ్రు మురళి అన్నారు. రాజీనామాలు చేసిన జగన్ వర్గం శానససభ్యులు వెనక్కి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ సోనియా గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. జగన్ ఇప్పటికైనా సిబిఐకి సహకరించాలని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. సిబిఐ దర్యాప్తునకు జగన్ సహకరించాలని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications