బాబు దూకుడు తెచ్చిన తంటా, సీనియర్ల అసంతృప్తి
దివంగత నేత వైయస్సార్, ఆయన కుమారుడు వైయస్ జగన్లపై, కాంగ్రెసుపై ఆయన అవినీతి ఆరోపణలను దంచికొడుతున్నారు. పనిలో పనిగా తనపై ఆరోపణలు చేస్తూ వార్తాకథనాలు ప్రచురిస్తున్న సాక్షి దినపత్రికపై విరుచుకుపడుతున్నారు. అయితే, ఈ ఉత్సాహంలో ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనలు పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. వేయి కోట్లిస్తే తన ఆస్తులు రాసిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన ప్రత్యర్థులకు ఆయుధాన్ని అందించినట్లయింది.
వేయి కోట్ల రూపాయల ఆస్తులను చంద్రబాబు కూడగట్టుకున్నట్లు ఆ ప్రకటన అర్థం ఇస్తోంది. దీంతో రెండెకరాల ఆసామి వేయి కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారనే విమర్శలు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుంచి ఎదురవుతున్నాయి. చంద్రబాబు అత్యుత్సాహం వల్ల ఈ సమస్య తలెత్తిందని పార్టీ సీనియర్లు అంటున్నారు. దూకుడు మంచిదే గానీ కాస్తా ఆలోచించి ప్రకటనలు గుప్పించాలనేది వారి అభిప్రాయం.