తెలంగాణ సకల జనుల సమ్మె, రహదారుల దిగ్బంధం

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వాళ్ల పైకి మరలుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు సోమవారం అన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా సోమవారం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన రహదారుల దిగ్బంధంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా జహీరాబాదులో ముంబై రహదారి దిగ్బంధంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం వారి వైపు మళ్లుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి తాకేలా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు సహనం ఉందని కొందరికి ఇబ్బందులు ఎదురైనా వారు ఓర్పు వహిస్తారన్నారు. ఇక నుండి రైలు రోకో, ఎయిర్ పోర్టుల ముట్టడి ఉంటుందన్నారు.
కాగా తెలంగాణవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. పలుచోట్ల బస్సు అద్దాలు ధ్వంసం, పోలీసు లాఠీ ఛార్జిలూ చోటు చేసుకున్నాయి. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వద్ద గేట్లకు తాళాలు వేశారు. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ మండలం పస్తాబాద్ వద్ద ప్రయివేట్ బస్సులను ధ్వంసం చేశారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రహదారుల దిగ్బంధం కారణంగా పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. నిజామాబాద్, అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లోనూ తెలంగాణవాదులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
కాగా హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి ఆర్టీసి అధికారులు గట్టి భద్రతతో 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే వాటని ఆర్టీసి జెఏసి అడ్డుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున బస్సులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. తెలంగాణ జిల్లాల్లోని 89 డిపోల్లో బస్సులు నిలిచి పోయాయి. కాగా తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రజల కోసం రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications