TTD కొత్త రూల్స్ ఎఫెక్ట్.. వడ్డీకాసులవాడికి విరాళాల వెల్లువ
కలియుగ వైకుంఠనాథుడు, వడ్డీకాసులవాడైన ఆ వేంకటేశ్వరుడి సన్నిధిలో సరికొత్త రికార్డు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం ఒక్కరోజే భక్తులు కనకవర్షం కురిపించారు. దాతల ప్రత్యేక సదుపాయాల (ప్రివిలేజెస్) నిబంధనల్లో బుధవారం నుంచి మార్పుల నేపథ్యంలో.. పాత విధానం ద్వారా లబ్ధి పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా రూ. 96.98 కోట్ల విరాళాలు సమకూరడం విశేషం.
పాత నిబంధనల కోసమే పోటెత్తిన దాతలు
నిబంధనలు మారుతున్నప్పటికీ, అంతకుముందు వరకు విరాళాలు సమర్పించిన వారికి పాత విధానం ప్రకారమే ప్రత్యేక సదుపాయాలు (దర్శనాలు, వసతి తదితరాలు) కొనసాగుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ లబ్ధిని చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో దాతలు ఒక్కసారిగా పోటెత్తారు.

మంగళవారం ఒక్కరోజే మొత్తం 2,460 మంది భక్తులు స్వామివారి ట్రస్టులకు విరాళాలు అందించారు. టెక్నాలజీని వాడుకుంటూ అత్యధికంగా 2,354 మంది ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపగా, 106 మంది ఆఫ్లైన్ ద్వారా తిరుమలలో నేరుగా చైర్మన్ ఆఫీస్ లో విరాళాలు సమర్పించారు.
విరాళాల వివరాలు..
భక్తులు తమ స్తోమతకు తగ్గట్టుగా సమర్పించిన విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి:
- రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల లోపు: 1,212 మంది
- రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల లోపు: 1,246 మంది
- రూ. కోటి అంతకంటే ఎక్కువ: ఇద్దరు దాతలు
మార్పుకు కారణం ఏంటి?
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి వీలైనంత ఎక్కువ దర్శన సమయాన్ని కేటాయించాలనే సత్సంకల్పంతోనే టీటీడీ.. దాతల ప్రివిలేజ్ విధానంలో మార్పులు చేసింది. ఇందులో భాగంగా దాతలకు కల్పించే సదుపాయాలను కొంతమేర తగ్గిస్తూ బుధవారం నుంచి సరికొత్త పాలసీని అమలులోకి తెచ్చింది.
జూన్ 26 నాటికి ఉన్న వివరాల ప్రకారం..
- మొత్తం నమోదైన దాతలు: 1,97,888 మంది
- రూ. లక్ష విరాళం ఇచ్చిన వారు: సుమారు 1,50,000 మంది
- రూ. 10 లక్షల విరాళం ఇచ్చిన వారు: సుమారు 22,000 మంది
ఏదేమైనా, నిబంధనల మార్పు నేపథ్యంలో మంగళవారం నాటి భక్తుల స్పందన తిరుమల చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోనుంది.














Click it and Unblock the Notifications