పది రోజుల్లో తెలంగాణ అంశంపై అధికారిక ప్రకటన?

సకల జనుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంట రాష్ట్ర విభజనే శ్రేయస్కరమనే నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అందులోని సాధ్యాసాధ్యాలు పార్టీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో పాటు, రాయల తెలంగాణ తదితర అంశాలని కేంద్రం పరిశీలిస్తోందన్న వాదనలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణకు సీమాంధ్ర నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రజలు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేమంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన రాయల తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల్లో చర్చానీయాంశం అయినప్పటికీ అనంతపురం, కర్నూలు జిల్లా నేతలు పలువురు దానికి ఓకే చేశారు.
అయితే కడప, చిత్తూరు, ఆంధ్రా జిల్లాల నేతలు అందుకు ససేమీరా అన్నప్పటికీ వారిని ఒప్పించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేయవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సకల జనుల సమ్మె, రాయల తెలంగాణ తదితర అంశాలతో రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కిన ఈ సమయంలోనే అటు సీమాంధ్ర నేతలు అక్టోబర్ రెండో వారంలో ఢిల్లీ వెళ్లనున్నారు. వారు సమైక్యాంధ్రనే ఉంచాలనే డిమాండుతో ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఐకాస నేతలతో కలిసి త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. సీమాంధ్ర నేతలను, ఇటు తెలంగాణ ప్రాంత నేతలను అధిష్టాం వారి ఢిల్లీ యాత్రలోనే రాష్ట్ర విభజనకు ఒప్పించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications