తెలంగాణ ఇష్యూ: ప్రధాని ప్రకటనకు కసరత్తు

రాష్ట్రపతి పాలన విధించే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రపతి పాలన విధిస్తే పార్లమెంటు ఆమోదం అవసరం. ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బిజెపి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దానివల్ల ప్రస్తుతానికి తెలంగాణ సకల జనుల సమ్మెను విరమింపజేయడానికి ప్రధానితో ఓ ప్రకటన చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రకటన ముసాయిదాను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, దానిపై కూడా సమావేశం ఒక నిర్ణయానికి రాలేదు. ఆ ప్రకటనలో పొందుపరచాల్సిన పదజాలంపై, వ్యాక్య నిర్మాణంపై శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. రేపు దీనిపై మరింత కసరత్తు జరిగే అవకాశం ఉంది.
గవర్నర్ నరసింహన్ రేపు శనివారం ప్రధానిని కలుస్తున్నారు. గవర్నర్ అందించిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రధాని చేయాల్సిన ప్రకటనకు తుది రూపం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చర్చలు పూర్తి కాలేదని, రేపు మళ్లీ చర్చలు చేస్తామని మినీ కోర్ కమిటీ సమావేశానంతరం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. మరింత లోతుగా కూడా చర్చలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తెలంగాణ సమ్మెను విరమింపజేయడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
మినీ కోర్ కమిటీ సమావేశానికి ముందు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ, ప్రధాని మన్మోహన్ సింగ్తోనూ చర్చలు జరిపారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను ప్రణబ్ ముఖర్జీకి అప్పగించిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తెలంగాణ అంశం మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications