పదిహేను రోజుల్లో తెలంగాణపై నిర్ణయం!
గవర్నర్ నరసింహన్ ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్తో చర్చించారు. దీంతో తెలంగాణపై ఢిల్లీలో ఏదో జరుగుతుందన్న భావనలో అందరిలో మెదులుతోంది. సకల జనుల సమ్మె సెగ హస్తిననూ తాకింది. తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా అధిష్ఠానం ప్రారంభించిన కసరత్తు వేగం పుంజుకుంది. కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని మినీ కోర్ కమిటీ సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది. ప్రణబ్తోపాటు హోంమంత్రి చిదంబరం, రక్షణమంత్రి ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ శనివారం మొత్తం చర్చల ప్రక్రియను కొనసాగించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్లతోపాటు రాష్ట్రానికి చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజులతో విడివిడిగా చర్చించారు.
ఈ ప్రక్రియ సాంతం కొంత భిన్నంగా సాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలు తమ అంతరంగాన్ని బయటపెట్టకుండా, 'ఏం చేద్దాం! మీ అభిప్రాయం ఏమిటి!' అంటూ నేతలకు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని విభజించాలా, వద్దా? విభజిస్తే సీమాంధ్రలో తలెత్తే పర్యవసానాలేమిటి? చేయకపోతే తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఐదు దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్తో ఏర్పడ్డ అనుబంధాన్ని ఎలా పరిగణించాలి? రాష్ట్రంలో ఉభయ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలం ఎలా ఉంది? విభజనపై నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి ప్రశ్నలను సంధించారు.
ఆయా ప్రశ్నలకు ఎవరు ఏ సమాధానం చెబుతున్నారో కోర్ కమిటీ సభ్యులు శ్రద్ధగా విన్నారు. అప్పటికప్పుడు నోట్ చేసుకున్నారు. స్థూలంగా చూస్తే... తెలంగాణ ఇవ్వక తప్పదని జైపాల్ రెడ్డి, రాజనరసింహ, డీఎస్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమని సీమాంధ్రకు చెందిన కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి చెప్పినట్లు సమాచారం. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోవాలని అందరూ కోరినట్లు తెలుస్తోంది. ఇక... సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు, మరో ముఖ్య నేత చిరంజీవికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు అందింది.
వీరు ఆదివారం ప్రణబ్తో, ఇతర కోర్కమిటీ సభ్యులతో సమావేశమవుతారని తెలుస్తోంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా సోమవారం కోర్కమిటీతో చర్చిస్తారని సమాచారం. మరోవైపు... సోమవారం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతారు. శనివారం 9 మంది ముఖ్య నేతలతో చర్చించిన ప్రణబ్... ఈ చర్చలు సోమవారం ముగుస్తాయని విలేకరులకు తెలిపారు. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటామె చెప్పలేనని అన్నారు. ఈ చర్చలు మగిసిన అనంతరం ప్రణబ్ తన నివేదికను సోనియాగాంధీకి సమర్పిస్తారని తెలుస్తోంది. సంప్రదింపులు, చర్చల ఆధారంగా దీపావళి నాటికి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై తుది అవగాహనకు వస్తుందని సమాచారం.