నిలిచిన రుతుపవనాలు - అప్పటిదాకా ఇక తప్పదు..!!
నైరుతి రుతపవనాల పై కీలక అప్డేట్. వర్షాలు కురుస్తుండటంతో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తాయని ఇప్పటి వరకు అంచనాలు వెల్లడయ్యాయి. కాగా, తాజాగా రుతుపవనాల వేగం మందగించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడుతు న్నాయని, ప్రస్తుతం దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రుతుపవనాలు నిలిచిపోయే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 10 రోజులవరకు ఉష్ణోగ్రతలు పెరుగవచ్చని అధికారులు తెలిపారు.
రుతువపనాల కదలిక నిలిచిపోయింది. ఈ ప్రభావంతో జూన్ 17 వరకు చెదురుమదురు వర్షాలు పడే అవకాశమున్నట్టు చెప్పారు. జూన్ 19 నుంచి 23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని,అప్పుడు మళ్లీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. జూన్ 1న వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదు కాలేదు. 10 రోజుల్లో -24 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ- హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపునకు ముందుకు కదలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

17వ తేదీ వరకు చెదురుమదురు వర్షాలు
ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడటం వల్ల జూన్ 17 వరకు తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగనుందని హెచ్చరించారు. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురు ముదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావం వల్ల 19- 23 తేదీల మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పులు ఉండవని తెలిపింది. రెండు రోజులుగా కొనసాగుతున్న వర్షాలు.. ఈ రోజు, రేపు కొనసాగుతాయని.. అదే సమయంలో రుతుపవనాలు నిలిచిన కారణంగా... ఎండల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications