Meenakshi Natarajan: సుప్రీంకు మీనాక్షి-రాజ్యసభ నామినేషన్ పై అత్యవసర విచారణ ..!
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) దాఖలు చేసిన నామినేషన్ ను అఫిడవిట్ లో తెలంగాణలో నమోదైన కేసు వివరాలు ఇవ్వలేదంటూ తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కమిషన్ సాయంతో బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన నామినేషన్ తిరస్కరణపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు.
మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ తిరస్కరించినట్లు తెలియగానే కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ ఈసీ తీరుపై మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారులు ప్రభావితమయ్యారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని నటరాజన్ ఆరోపించారు. వారు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతినిధులుగానూ, ఆ ప్రభుత్వ అనుబంధ సంస్థల అధిపతులుగానూ వ్యవహరించారని విమర్శించారు. పూర్తిగా అభ్యంతరకరమైన, బహిరంగమైన , స్పష్టంగా చట్టవిరుద్ధమైన ఆ ఉత్తర్వును పక్కనపెట్టి, తక్షణమే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర విచారణ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తో పాటు నామినేషన్ల ఉపసంహరణ తేదీ ముగిసిపోవడంతో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. మరోవైపు మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ ను ఎలాగైనా ఓడించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు రెండు రోజుల క్రితం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన అధిష్టానం వారిని బెంగళూరు తరలించింది. దీంతో చేసేది లేక ఈసీ సాయంతో బీజేపీ ఇలా ఉత్తర్వులు ఇప్పించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.














Click it and Unblock the Notifications