తెలంగాణ సమ్మె: ఇక దూకుడుగా ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు మెతగ్గా వ్యవహరించినట్లు, ఇక ఆ మెతక వైఖరి ఏ మాత్రం ఉండదని ఆయన అంటున్నారని సమాచారం. తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా తేల్చాలని తాను కోరుతుంటే, సమ్మెను విరమింపజేయడంలో విఫలమయ్యారంటూ అధిష్టానం తనపై నిందలు మోపడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుందనే అభిప్రాయానికి వచ్చి తెలంగాణ సమ్మెను అవసరమైన బలప్రయోగం ద్వారా అదుపు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణవాదులపై తాము కఠినంగా వ్యవహరిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పకనే చెప్పారు. ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్ ఓ టీవీ చానెల్ ప్రతినిధుతో మాట్లాడిన తీరు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. విద్యాసంస్థలను మూసేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునివ్వడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సమ్మెను ఎలా విరమింపజేయాలో తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి తెలంగాణ సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందని అర్థమవుతోంది.
కాగా, సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి తెలంగాణ మంత్రులు పలువురు హాజరయ్యారు. కె. జానా రెడ్డి, శ్రీధర్ బాబు, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, డికె అరుణ, సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో యువకిరణాలు, రచ్చబండ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. అదే సమయంలో సకల జనుల సమ్మెపై కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications