తెరాసలోకి మరో ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జంప్
ఆలాగే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా త్వరలో కాంగ్రెసుకు రాజీనామా చేసి తెరాసలో చేరుతారని అంటున్నారు. ఆయన శనివారం తన నియోజకవర్గం కొల్లాపూర్ కార్యకర్తలతో మాట్లాడారు. రేపు ఆదివారం మరోసారి హైదరాబాదులో తన ముఖ్య అనుచరులతో సమావేశమై కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరే విషయంపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని భావిస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులు తెరాసవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, తెరాసలో చేరాలని అనుకుంటున్న శాసనసభ్యుల విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చింది.
కాగా, కాంగ్రెసుకు చెందిన ఇద్దరు తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కూడా తెరాస నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన పార్లమెంటు సభ్యులకు గాలం వేసేందుకు తెరాస చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. తెరాసలో చేరే విషయంపై అనుకూలంగా గానీ ప్రతికూలంగా గానీ ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు ఇంతకు ముందు గాలం వేసిన తెరాస ఇప్పుడు కాంగ్రెసుపై దృష్టి సారించింది.