తెలంగాణపై మిత్రులతో ప్రణబ్ చర్చలు, బాలుతో పూర్తి

పార్టీపరంగా రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల నాయకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చర్చలు పూర్తి చేశారు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ మిత్ర పక్షాలతోనూ జాతీయ పార్టీలతోనూ చర్చలు జరిపే బాధ్యతను నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది. సాధ్యమైనంత త్వరగా యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీలతో చర్చలు జరుపుతారా లేదా అనేది తెలియడం లేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో మిత్రపక్షాలను సంప్రదించుకుండానే 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. కాంగ్రెసు ఏకపక్షంగా ప్రకటన చేసిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దాంతో తదుపరి ప్రకటనపై అభ్యంతరాలు రాకుండా మిత్రపక్షాలతో కూడా ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ సమస్య పరిష్కారం బాధ్యతను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీకి, గులాం నబీ ఆజాద్కు అప్పగించారు.












Click it and Unblock the Notifications