వైయస్ జగన్ వర్గంలో చివరకు మిగిలేది వీరేనా?
తాము బయటకు వెళ్లినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, ప్రభుత్వానికి మరో రెండున్నరేళ్ల సమయం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెసు వైపు చూస్తున్నారు. నిన్నటి వరకు దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించమని హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిర్ణయం స్పీకర్కు వదిలేస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు పలికేది లేదన్న అదే నోటితో ఇప్పుడు టిడిపి అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని ఆదుకుంటామని చెబుతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. మరికొందరు కాంగ్రెసులోని తమ తమ సన్నిహిత నేతల ద్వారా సిఎం, పిసిసి చీఫ్కు రాయబారం పంపిస్తున్నారట. ఇంకొందరు స్పీకర్తో భేటీ అయి రాజీనామాలు ఆమోదించవద్దని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో చివర వరకు జగన్తో ఉండేవారు కేవలం ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు. జగన్కు కుటుంబానికి సన్నిహితులు, బంధువులు ఐన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, మొదటి నుండి జగన్కు అండగా ఉంటున్న మేకపాటి సోదరులు, కాపు రామచంద్రా రెడ్డి, మంత్రి ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణారావు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం నుండి మొదటి నుండి మద్దతు ఇస్తున్న కొండా సురేఖ కూడా జగన్తోనే ఉండే అవకాశాలున్నాయి. వీరు మినహా జగన్ శిబిరం ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. అయితే వివిధ కారణాల వల్ల కాంగ్రెసులోకి వెళతారనుకున్న కొంతమంది నేతలు ఆయన వద్దే కొనసాగుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి స్పీకర్ రాజీనామాలపై త్వర త్వరగా నిర్ణయం తీసుకుంటున్న సమయంలో వారు వెనక్కి వెళ్లడం విశేషం.