ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, సమర్థింపునకే టైమ్
తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పిటిషన్ వేయడం వెనక రాజకీయ కుట్ర ఉందని, తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కాంగ్రెసు పెద్దలు ఆమె చేత పిటిషన్ వేయించారని విమర్శలు చేస్తున్నారు. నిజానికి, చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు సరైనవే అయితే, ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు ఇంత ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం లేదని, దర్యాప్తులు ఎన్ని జరిగినా నింపాదిగా ఉండేవారని అంటున్నారు. తన ఢిల్లీ పర్యటనపై కూడా విమర్శలు వస్తుండడంతో ఆయన దాన్ని సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) కన్వీనర్ శరద్ యాదవ్ను చంద్రబాబు కలవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కేసుల నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన బిజెపితో ఒప్పందం చేసుకుంటున్నారని విమర్శించారు.
దానిపై చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో వేరే ఉద్దేశాలు లేవని చెప్పుకోవాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సతమతమైన చంద్రబాబు జాతీయ నాయకులతో చెప్పుకుని బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. గతంలో జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు కూడా అదే రీతిలో జరిగాయి. కాంగ్రెసు పెద్దల వద్ద రాజీ పడి కేసుల నుంచి బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. అదే విమర్శను ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చేస్తున్నారు. దాంతో తమ నేత జగన్పై తెలుగుదేశం విమర్శలు చేసినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చంద్రబాబుపై చేస్తే తప్పేమిటని అడుగుతున్నారు.