చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తారా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో పర్యటించగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయనే నమ్మకం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రస్తుత స్థితిలో ఎన్నికలు వస్తే ఓ ఊపు ఊపే అవకాశాలున్నాయి. సీమాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీ అంత సక్రమంగా ఏమీ లేదు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా, తెలుగుదేశం మూడో స్థానంలో ఉన్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస మాత్రమే మధ్యంతర ఎన్నికలను కోరుకుంటున్నాయి. అందుకే, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదింపజేయడానికి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తెలుగుదేశం అవిశ్వాసం ప్రతిపాదిస్తే ప్రభుత్వానికి మద్దతిస్తామని అంటున్నారు. కానీ, వారిని నమ్మడానికి కాంగ్రెసు గానీ తెలుగుదేశం గానీ సిద్ధంగా లేవు. సమయానికి వారు ఎలా వ్యవహరిస్తారో, ఏం చేస్తారో కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు. వ్యూహంలో భాగంగానే వారు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తామని ప్రకటనలు చేస్తుండవచ్చునని, నిజంగానే తెలుగుదేశం అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఏదో కారణం చెప్పి ఓటింగుకు దూరంగా ఉండవచ్చునని అంటున్నారు. ఇదే అనుమానం తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లుంది. అందుకే చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించడానికి వెనకాడుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, డిసెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో అసలు విషయం బయటపడుతుంది. సభను ఒకటి రెండు రోజులు మాత్రమే సమావేశపరచవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.