రెంటికి చెడిన రేవడిలా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు
పార్టీకి చేసిన రాజీనామాలపై జగన్ వర్గం శానససభ్యులను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిసెంబర్ 1వ తేదీ నుంచి వివరణ కోరనున్నారు. అవసరమైతే వారి రాజీనామాలను ఆమోదించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని జగన్ వర్గం శాసనసభ్యులు భయపడుతున్నారు. శాసనసభ సమావేశాల్లో వారిని వాడుకుని ఆ తర్వాత వారి రాజీనామాలను ఆమోదించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా చేస్తే ఆరు నెలల్లోగా వారు ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు వారికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. కాంగ్రెసు వైపు ఉంటామని చెప్పినందున వారికి జగన్ తన పార్టీ ఇచ్చేందుకు కూడా ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు.
కాగా, వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో ఈ నెల 24వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి వచ్చిన శాసనసభ్యులనే ఆయన విశ్వాసంలోకి తీసుకుంటారని అంటున్నారు. ఈ సమావేశానికి వెళ్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, బొత్స సత్యనారాయణ గానీ వారిని విశ్వసించే అవకాశాలు లేవు. అలా విశ్వసించకపోతే తమ రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఆమోదించవచ్చు. అలా ఆమోదించినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తాము రాజీనామాలు చేసినందుకు అసెంబ్లీకి హాజరు కాబోమని చెబుతున్నారు. ఒకవేళ దీనికి చంద్రబాబు అంగీకరిస్తే ప్రభుత్వం జగన్ వర్గం శాసనసభ్యులు లేకున్నా గట్టెక్కుతుంది. చంద్రబాబు మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడమే తమకు శ్రీరామరక్షగా మారుతుందని కాంగ్రెసు నాయకత్వం భావిస్తుంది. ఏమైనా, కష్టాలన్నీ ఇప్పుడు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకే.