అవిశ్వాసం ఫైట్: వైయస్ జగన్ వర్సెస్ చంద్రబాబు

ఇన్నాళ్లూ అవిశ్వాసం పెట్టండి మద్దతిస్తామని టిడిపిని ఇరకాటంలో పెట్టాలని చూసిన జగన్ వర్గం అవిశ్వాసంపై గట్టిగా మాట్లాడనప్పటికీ టిడిపి చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితేనే మద్దతిస్తామని కొత్త మెలిక పెడుతోంది. దీంతో టిడిపి చిత్తశుద్ధి వీరికి ఎలా తెలుస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఇన్నాళ్లు సవాళ్లు విసిరిన నోటితే మద్దతు ఇవ్వలేమని చెప్పలేకనే వారు ఇలా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ సిబిఐ, ఈడి విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయం ఎమ్మెల్యేల్లో నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. మరో రెండు సంవత్సరాలు కాంగ్రెసు పాలన ఉన్నందున జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి జగన్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు.
ఇలాంటి సమయంలో టిడిపి అవిశ్వాసం ప్రవేశ పెడితే తాము మద్దతిస్తామని బహిరంగ ప్రకటనలు చేసి మద్దతిచ్చిన పక్షంలో వారిపై వేటు పడుతుంది. ఆ వేటుకు వీరు సిద్ధంగా కనిపించడం లేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కేలా లేదు. ప్రభుత్వానికి తాము మద్దతు ప్రకటించకున్నా కిరణ్ ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదనే చెప్పవచ్చు. గెలుస్తామో లేదో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి అవిశ్వాసానికి మద్దతిచ్చి వేటు వేయించుకోవడమెందుకనే మీమాంసలో జగన్ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అదనుగా టిడిపి వారిపై సవాళ్లపై సవాళ్లు విసురుతోంది.












Click it and Unblock the Notifications