సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలం తెనుగు పల్లెలో 1928, మే 11న సామల సదాశివ జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర, మిర్జాగాలిబ్ జీవిత చరిత్ర, మరాఠీ కవి కేశివసుత్ జీవిత చరిత్ర, అమ్జత్ రుబాయాలు వంటి ఎన్నో పుస్తకాలు రచించారు. గిరిజన యోధుడు కొమురం భీంను పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చిన ఘనత ఆయనదే. తెలుగు, ఉర్దూ భాషల్లో వందలకొద్దీ సాహిత్య వ్యాసాలు రాశారు. హిందూస్తానీ సంగీతంపై రచించిన గ్రంథం స్వరలయలు 'అంజన్ రుబాయిలు' రచనకుగాను 1964లో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 1969లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనను వరించాయి. ఆయన రచించిన మలయమారుతాలు, సంగీత శిఖరాలు వంటి వ్యాససంకలనాలు ఎంతగానో ప్రసిద్ధి పొందాయి. ఉర్దూ, పార్శీ, సంస్కృతం, మరాఠి, హిందీ, ఇంగ్లీష్ భాషల్ని పుక్కిట పట్టిన బహుభాషా కోవిదుడాయన. 'యాది' పేరిట ఆయన రాసిన వ్యాసాలు ఎంతగానో ప్రజాదరణ పొందాయి.
ఇతర పురస్కార గ్రహీతలు..
దివంగత కాబిన్ ఫుకాన్ (అస్సామీ), మణీంద్ర గుప్తా (బెంగాలీ), మోహన్ పర్మార్ (గుజరాతీ), కాశీనాథ్ సింగ్ (హిందీ), గోపాలకృష్ణ పాయ్ (కన్నడ), నసీమ్ షఫాయీ (కాశ్మీరీ), మెల్విన్ రోడ్రిగ్స్ (కొంకణి), ఎం.కె.సాను (మలయాళం), క్షేత్రి బిరా (మణిపురి), గ్రేస్ మాణిక్ గోడ్ఘాటే (మరాఠీ), కల్పనా కుమారి దేవి (ఒరియా), బాల్దేవ్ సింగ్ (పంజాబీ), అతుల్ కనక్ (రాజస్థానీ), ఆదిత్యకుమార్ మండి (సంతాలీ), మోహన్ గెహానీ (సింధీ), ఎస్. వెంకటేశన్ (తమిళం), ఖలీల్ మామూన్ (ఉర్దూ), లలిత్ మగోత్రా (డోగ్రీ), ప్రేమానంద మొసాహరి (బోడో). నేపాలీ భాషలో పురస్కారాన్ని ప్రకటించలేదు. 2012, ఫిబ్రవరి 14న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాతో అకాడమీ వీరందరినీ సత్కరించనుంది.












Click it and Unblock the Notifications