థేన్ బీభత్సం: కల్లోలంగా నెల్లూరు, ప్రకాశం తీర ప్రాంతం
థానే తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టేంత వరకూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఢిల్లీలో ఉన్న సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు. రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి, సిఎస్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సహాయక పునరావాస కేంద్రాల్లో వసతులు అందించి ఆహారం, మందులు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని సూచించారు. థేన్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మేఘాలు కమ్ముకోవడం వల్ల మధ్యాహ్నం వర్షాలు పడే అవకాశముందన్నారు.
కాగా థానే తుఫాను పుదుచ్చేరికి ఆగ్నేయంగా తమిళనాడు తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విద్యాసంస్థలకు, ప్రభుత్వాధికారులకు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశముంది.