కల్తీ సారాకు 15 మంది బలి, బొత్సపై దేవినేని ధ్వజం
కృష్ణా జిల్లాలో కల్తీ సారా కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు మద్దతుగా జిల్లా ఎమ్మెల్యే, అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు అతనికి ఉదయం నాలుగు గంటల నుండి గృహనిర్బంధం విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్గ్రేషియా ఇవ్వాలని దేవినేని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తాను మద్యం వ్యాపారం చేస్తున్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఎసిబి రిపోర్టు వచ్చినప్పుడే ప్రభుత్వం బయటపెడితే కల్తీ సారా వల్ల ఇంతమంది చనిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. జిల్లా మంత్రులు, సిఎం ఇప్పటి వరకు ఈ విషయంపై నోరు తెరవలేదని ఆరోపించారు. కొత్త సంవత్సరం సందర్భంగా మాట్లాడకూడదని అనుకోవద్దని సూచించారు. కల్తీ సారాపై కేవలం పోలీసులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఎసిబి రిపోర్టులు బయట పెట్టి చిన్న చేపలను కాకుండా పెద్ద చేపలను బయటకు రప్పించాలన్నారు. బాధితులకు చికిత్స సరిగా అందించడం లేదంటూ బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహించాయి.