సంక్రాంతి తర్వాత జగన్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా జగన్వర్గ ఎ మ్మెల్యేలు ఓటేసిన విషయం తెలిసిందే. తాను విప్ను ఎందుకు ధిక్కరించాల్సి వచ్చిందో వివరిస్తూ తొలుత ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి స్పీకర్ మనోహర్కు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో పాటు రాజీనామా లేఖనూ పంపారు. అయితే విప్ను ధిక్కరించడానికి గల కారణాలను వివరిస్తూ మళ్లీ లేఖ పంపారు. దీంతో న్యాయవాదుల సమక్షంలో శోభా నాగి రెడ్డిని స్పీకర్ విచారించనున్నారు. ఇక మిగిలిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే విధానాన్ని అవలంభించవలసి ఉంటుంది. రోజుకు నలుగురు ఎమ్మెల్యేల చొప్పున నాలుగు పని దినాల్లో ఈ విచారణ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వస్తుందని స్పీకర్ కార్యాలయం చెబుతోంది. ఇవన్నీ పరిశీలిస్తే ఈ నెలఖారు నాటికి జగన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. శాసనసభా బడ్జెట్ సమావేశాల నాటికి జగన్ వర్గ ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని అసెంబ్లీ వర్గాలు వివరిస్తున్నాయి.