తమిళనాడులో విజయ్ గెలుపుతో తెలంగాణాలో ధైర్యం వచ్చిందన్న కవిత!
తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి ఎన్నికల్లోనే అధికారం సాధించడం చూసి తనకు తెలంగాణలో బలమైన నమ్మకం కలిగిందని ఆమె తెలిపారు.రాజకీయ రంగంలో అనేక పార్టీలు ఏర్పడతాయి, కొన్ని కాలం తర్వాత అదృశ్యమవుతాయని కవిత అన్నారు.
తమిళనాట విజయ్ విజయంతో తెలంగాణలో తమకు బలం వచ్చింది: కవిత
కానీ కొన్ని పార్టీలు మాత్రమే ప్రజల మద్దతుతో విజయం సాధిస్తాయని, మరికొన్ని విఫలమవుతాయని వివరించారు. తాము అనేక విజయాలు, వైఫల్యాలను చూశామని, అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలంగా ముందుకు సాగుతోందని ఆమె వెల్లడించారు. తమిళనాడులో విజయ్ సాధించిన అపూర్వ విజయం తెలంగాణలో కూడా కొత్త పార్టీలు అధికారం సాధించవచ్చనే ఆశను, నమ్మకాన్ని కలిగించిందని కవిత చెప్పారు.

తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న కవిత
టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత రెండు మూడు సంవత్సరాల్లో తాను ఎన్నో కష్టాలు, అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ వేలాది మంది మద్దతుదారులు తన వెనక నిలిచారని గుర్తు చేశారు. జైలు శిక్ష అనుభవించిన సమయంలోనూ, బయటికి వచ్చిన తర్వాత కూడా తన పట్ల ప్రజల మద్దతు పెరుగుతోందని కవిత తెలిపారు.
బలమైన నాయకుడి వద్ద రాజకీయ శిక్షణ పొందానన్న కవిత
ఆ మద్దతుకు ఎలా ప్రతిఫలం ఇవ్వాలో తెలియడం లేదని ఆమె భావోద్వేగం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 10 రోజుల్లోనే జెండా పండగ కార్యక్రమం నిర్వహించిన స్పందన చూసి కార్యకర్తల కమిట్మెంట్ అర్థమైందని చెప్పారు. ఇలాంటి అంకితభావం ఉన్నవారితోనే పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. తాను ఒక బలమైన నాయకుడి వద్ద రాజకీయ శిక్షణ పొందానని, ఎలాంటి వైఫల్యం వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలని నేర్చుకున్నానని కవిత వివరించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను విజయవంతం చేసి చూపిస్తానన్న కవిత
గతంలో ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి, వైఎస్ షర్మిల వంటి నాయకులు కొత్త పార్టీలు స్థాపించి విఫలమయ్యారని, కానీ టీఆర్ఎస్ ఆ తప్పిదాలు పునరావృతం చేయదని ఆమె హామీ ఇచ్చారు. వందకు వెయ్యి శాతం టీఆర్ఎస్ను విజయవంతం చేసి చూపిస్తామని కల్వకుంట్ల కవిత గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కవిత నాయకత్వంలో టీఆర్ఎస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.













Click it and Unblock the Notifications