కాంగ్రెసులో ఢీ అంటే ఢీ, ముదురుతున్న విభేదాలు

దివంగత వైయస్ ఉన్నప్పడు పార్టీ అంతా ఆయన వద్దే కేంద్రీకృతమైంది. ఏమైనా చిన్న విభేదాలు వచ్చినా అంతగా ప్రభావం చూపేవి కావు. ఆయన దుర్మరణం తర్వాత రోశయ్య వచ్చారు. అప్పటి నుండి అధిష్టానమే పార్టీ వ్యవహారాలు చూసుకుంటుంది. వైయస్కు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం ఒక్కరి చేతికి పగ్గాలు ఇవ్వడం మానుకుంది. ఏకకాలంలో ఎక్కువ మందిని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కారణంగా కూడా గ్రూపు విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రోశయ్య తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, డి శ్రీనివాస్ తర్వాత వచ్చిన బొత్స సత్యనారాయణ మధ్య ఇప్పటి వరకు సమన్వయం లేదు. ఇరువురు సై అంటే సై అనుకుంటున్నారు. ఇటీవల మద్యం సిండికేట్లపై దాడి బొత్సను టార్గెట్ చేసుకునే అనే వాదనలు వినిపించాయి.
ఒకే తోవలో వెళ్తున్న బొత్స, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిలకు చెక్ చెప్పేందుకు సిఎం కిరణ్ హీరో మహేష్ బాబుకు గాలం వేస్తున్నారట. మరోవైపు సామాజిక వర్గం, ప్రాంతీయతను అడ్డం పెట్టుకొని మరోనేత కూడా ఉన్నత పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూ, కిరణ్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నట్లుగా సమాచారం. పైకి రెండు గ్రూపులుగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెసులో ఇప్పుడు చాలా గ్రూపులే ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలాగుంటే 2014 నాటికి ఎలా ఉంటుందోనని కాంగ్రెసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.












Click it and Unblock the Notifications