హరిచంద్ర యుద్ధం: చంద్రగిరికి హరికృష్ణ డుమ్మా
కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరీ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ, తదితరుల ఫోటో ఫ్రేమ్లతో కూడిన కటౌట్లు, బ్యానర్లు నారావారి పల్లెలో ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. వాటిలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు లేవు. చంద్రబాబు, హరికృష్ణ మధ్య దూరానికి అది మరింత బలం చేకూరుస్తోంది.
చంద్రబాబు నివాసంలోని పండుగ సంబరాలకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లను ఆహ్వానించి ఉండాల్సిందనే అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. గతంలో దూరమైన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసిపోయారు. రామ్మూర్తి నాయుడితో కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులంతా ఈ సంబరాలకు వచ్చారు.
తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తనకు, తన కుటుంబ సభ్యులకు తగిన స్థానం దక్కడం లేదనే ఉద్దేశంతో హరికృష్ణ ఉన్నారు. పైగా, పార్టీ పగ్గాలను చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు అప్పగించాలనే ప్రయత్నం ఆయన కోపానికి ఆజ్యం పోసింది. లోకేష్కు పోటీగా ఆయన తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ను నిలబెట్టారు. దీంతో బాలకృష్ణను తనకు మరింత చేరువ చేసుకుని తన వ్యూహాన్ని అమలు చేసే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ను ఎదుర్కునే వ్యూహం అందులో ఇమిడి ఉందని అంటున్నారు.