శాఖలపై చిరంజీవి ఫైట్: కిరణ్ కుమార్ రెడ్డి ససేమిరా
ఈ నెల 6న గులాంనబీ ఆజాద్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మాకు ఇస్తామన్న శాఖలు వేరని, ఇప్పుడు మీరు ఇస్తామంటున్న శాఖలు వేరని, తమకు విద్యుత్తు, వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించాలని చిరంజీవి చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించలేదు. "ఇలా శాఖలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వారు తమకు ఇష్టమైన శాఖలు కావాలని అడుగుతారు. ఇది సంప్రదాయంగా మారే ప్రమాదముంది'' అని బదులిచ్చారు.
శాఖలపై తేడా రావడంతో సి రామచంద్రయ్య, గంటా తమ నేత చిరంజీవితో భేటీ అయ్యారు. ఆ తర్వాత గురువారం రాత్రి పీఆర్పీ ముఖ్య నేతలంతా నగర శివారులోని ఒక ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. అధిష్ఠానం అదేశించినప్పటికీ ముఖ్యమంత్రి ఇలా ఎందుకు చేస్తున్నట్లు అనే విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై మథనం సాగించారు. ఈ వివాదాన్ని ఢిల్లీ స్థాయిలో అధిష్టానంతోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం హైదరాబాదు వస్తున్న గులాం నబీ ఆజాద్ ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.