చంద్రబాబు వ్యూహం: బాలయ్యపై ఇప్పటికే నిర్ణయం?
మరోవైపు సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల, తెలంగాణలో ఉద్యమం వల్ల పార్టీ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకే ఇప్పటికిప్పుడు బాలయ్యను తెరపైకి తీసుకు వచ్చారని అంటున్నారు. పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే పార్టీకి ఎంతో లబ్ధి చేకూరుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నా, పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమని బాలయ్య అంటున్నా, బాలయ్య ఇప్పుడు పోటీ చేయరని చంద్రబాబు చెబుతున్నా... బాబు, బాలయ్యల మధ్య మాత్రం ఎక్కడి నుండి, ఎప్పుడు పోటీ అనే అంశంపై నిర్ణయం దాదాపు జరిగిపోయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పార్టీలో ఉత్సాహం నింపడానికి, మరోవైపు కాంగ్రెసులో విలీనం అయిన చిరంజీవి మాస్ ఇమేజ్ను ధీటుగా ఎదుర్కొన గల సత్తా బాలయ్యకే ఉండటం వల్లనే ఆయనను వ్యూహాత్మకంగా రంగంలోకి బాబు దింపారనే వాదనలు వినిపిస్తున్నాయి.