కేంద్రం సంచలన నిర్ణయం.. ఏకంగా 50 ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్ ను ప్రసారం చేస్తున్న 50 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను బ్లాక్ చేసింది. రెండేళ్లలో ఏకంగా 50 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను రద్దు చేసింది. ఈ టాప్ స్ట్రీమింగ్ ఓటీటీ మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ ను ప్రదర్శించడం, 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని లిఖిత పూర్వంగా అందించారు. నాసిక్ ఎంపీ రాజాభౌ పరాగ్ ప్రకాశ్ వాజే సంధించిన ప్రశ్నకు బదులుగా మంత్రి మురుగన్ ఈ సమాచారాన్ని బయటపెట్టారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేంద్ర ప్రభుత్వంలోని అనేక చట్టాలను ఉల్లంఘించాయని వాటిలో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67, సెక్షన్ 67 ఏ తదితర సెక్షన్లు ఉన్నాయని మంత్రి మురుగన్ పేర్కొన్నారు. ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇప్పుడున్న ఓటీటీలు చట్టాల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే కంటెంట్ పైనా సెన్సార్ పరంగా నియంత్రణ తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇంతవరకూ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే పరిమితమైన సెన్సార్ బోర్డు నిబంధనలు ఇకపై ఓటీటీ కంటెంట్ కు కూడా వర్తించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సమాచార సాంకేతిక నిబంధనలను సవరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లు కంటెంట్ విషయంలో స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. అయితే అశ్లీల కంటెంట్ ను ప్రదర్శించే ఓటీటీ మాధ్యమాలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది.


Click it and Unblock the Notifications