ఈ ఎంబిఎ గ్రాడ్యుయేట్ హైటెక్ దొంగ, కటకటాల వెనక్కి

కోటేశ్వరరావు (29) గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సంజీవయ్య అనే వ్యక్తి ఖాతా నుంచి 2009 నుంచి 9 లక్షల రూపాయలు డ్రా చేశాడు. సంజీవయ్య ఆ విషయాన్ని కూడా గుర్తించలేదు. గత రెండేళ్లుగా భీమిరెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తి ఖాతా నుంచి లక్ష రూపాయల దాకా డ్రా చేశాడు. చివరకు కోటేశ్వర రావు కథ పోలీసుల చేతికి చిక్కడంతో కంచికి చేరింది. కోటేశ్వర రావు దొంగతనం చేసే పద్ధతిని సత్తెనపల్లి ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ వివరించాడు.
గుంటూరు నుంచి సత్తెనపల్లికి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైలులో కోటేశ్వర రావు ప్రయాణించేవాడు. ఆ రైలు సత్తెనపల్లికి అర్థరాత్రి 12 గంటలకు చేరుకుంటుంది. దీంతో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉంటారు. దాంతో ప్రయాణికుల జేబుల నుంచి పర్సులు తీసి డెబిట్, క్రెడిట్ కార్డులు కొట్టేసి సత్తెనపల్లిలో దిగిపోయేవాడు. ఆ తర్వాత ఓ ఇంటిని ఎంపిక చేసుకుని అక్కడ డెబిట్, క్రెడిట్ కార్డులు కొట్టేసేవాడు. తెల్లవారే లోగా తిరిగి గుంటూరు వచ్చేవాడు. దాంతో ఎవరికీ అతనిపై అనుమానం వచ్చేది కాదు. ఆ తర్వాత కంప్యూటర్ ముందుకు కూర్చుని తాను దొంగిలించిన క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్లను డికోడ్ చేసేవాడు. ఖాతాల నుంచి మొత్తం సొమ్మును తీసేవాడు కాదు. దీంతో కార్డు హోల్డర్లకు కూడా అనుమానం వచ్చేది కాదు.
కోటేశ్వర రావు నేరచరిత్ర చాలా పాతదే. విజయవాడలో 1999లో పాలిటెక్నిక్ చదువుతుండగా చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించాడు. ఓసారి పోలీసులకు చిక్కి జైలు జీవితం కూడా అనుభవించాడు. ఆ తర్వాత ఎంబిఎ చదివి ఓ బహుళ జాతి సంస్థలో పనిచేశాడు. అక్కడ ఉద్యోగం వదిలేసి పూర్తి కాలం దొంగగా మారిపోయాడు. కోటేశ్వర రావు నుంచి పోలీసులు ఓ నానో కారు, రూ. 16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు, హై ఎండ్ మొబైల్ ఫోన్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications