బిజెపి రాజకీయాలను వేడెక్కించిన యడ్యూరప్ప
యడ్యూరప్ప సోమవారం ఉదయం తుంకూరులోని గురువు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సదానంద గౌడ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమేనని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నాయకత్వంపై ఒత్తిడి పెట్టడం లేదని చెప్పారు. తాను సామాన్య కార్తకర్తగా ఉండిపోతానని ఆన్నారు. సోమవారం మధ్యాహ్నం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఆయన బిజెపి నాయకత్వానికి డెడ్ లైన్ పెడతారని అంటున్నారు. యడ్యూరప్పకు 60 నుంచి 70 మంది శానససభ్యుల మద్దతు ఉన్నట్లు చెబుతున్నారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రి సదానంద గౌడను, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్పను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనంతకుమార్ వర్గం యడ్యూరప్పకు మద్దతిస్తోంది. ఈ స్థితిలో జగదీశ్ షెట్టర్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, తనకు బిజెపి రాష్ట్రాధ్యక్ష పదవి ఇవ్వాలని యడ్యూరప్ప పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు యడ్యూరప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన భవిష్యత్తు కార్యక్రమం గురించి, తన డిమాండ్ల గురించి వివరించే అవకాశాలున్నాయి.