టీటీడీకి తమిళనాడు నుంచి అందిన శ్వేతాశ్వం: ప్రధాన ఆకర్షణగా.. !!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 90,130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,075 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.13 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.23 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 3.11 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 4,104 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తాజాగా టీటీడీకి భారీగా విరాళాలు అందాయి. తమిళనాడులోని మదురైకి చెందిన వడివేలు ముగంధన్ అనే శ్రీవారి భక్తుడు టీటీడీ ఎస్వీ గోశాలకు ఓ తెల్ల గుర్రాన్ని విరాళంగా అందజేశారు. దీన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం స్వామివారి సేవల కోసం వినియోగించేలా ఏర్పాట్లు చేస్తోన్నారు ఎస్ వీ గోశాల అధికారులు. దీంతో గోశాలలో ఉన్న గుర్రాల సంఖ్య అయిదుకు చేరింది.
హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు భారీ విరాళాన్ని అందించింది. 4.41 కోట్ల రూపాయల మొత్తంతో కూడిన డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సంస్థ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
అలాగే.. బెంగుళూరుకు చెందిన వికేష్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. తిరుపతికి చెందిన డాక్టర్ సింగపాటి సుబ్బారావు తన కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరుమీదుగా సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించారు.












Click it and Unblock the Notifications