వివాదంలో కెసిఆర్: పార్టీ ఆఫీసు నుంచి టీవీ చానెల్
తెరాసకు పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరాస పార్టీ కార్యాలయం కోసం బంజారాహిల్స్లో ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించింది. నామమాత్రం ధరకు ఈ భూమి కేటాయింపు జరిగింది. చదరపు గజానికి వంద రూపాయల ధర నిర్ణయించారు. ఎకరా భూమికి కేవలం 4.8 లక్షల రూపాయలు మాత్రమే అయింది. అప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే మార్కెట్ రేటు చదరపు గజానికి 5వేల రూపాయలు ఉంది.
తెలుగుదేశం పార్టీకి జూబ్లీహిల్స్లో, సిపిఎంకు బాగ్ లింగంపల్లిలో, బిజెపికి నాంపల్లిలో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వం భూములు కేటాయించింది. అదే పద్ధతిలో తెరాసకు కూడా బంజారాహిల్స్లో ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే, పార్టీ కార్యాలయంలో టీవీ చానెల్ కార్యాలయం పెట్టి కెసిఆర్ నిబంధనలు ఉల్లంఘించారనేది షబ్బీర్ అలీ ప్రధాన అభ్యంతరం.