తెరాసకు లగడపాటి కౌంటర్: బెజవాడలో ఐటి కంపెనీలు
విజయవాడలో ఐటి పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకు ఆయన ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన ఐటి రంగ నిపుణుడు జెఎ చౌదరి, మహాలక్ష్మి గ్రూప్ సంస్థల చైర్మన్ హరిశ్చంద్రప్రసాద్లతో ఆయన చర్చించారు. దీనిపై లగడపాటి రాజగోపాల్ ఓ తెలుగు దినపత్రిక వివరించారు. గన్నవరం సమీపంలో 30 ఎకరాల స్థలంలో మేధ పేరిట ఐటి పార్కు ఉందని, అయితే అందులో 15 శాతం భూమి మాత్రమే వినియోగంలో ఉందని, మిగతా స్థలంలో ఐటి సంస్థల స్థాపనకు రోడ్ మ్యూప్ను రూపొందించామని ఆయన చెప్పారు. కృష్ణా, గంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఐటి కంపెనీలు నడుపుతున్నారని, వారితో చర్చలు జరిపి విజయవాడకు ఐటి కంపెనీలు వచ్చేలా చేస్తానని ఆయన చెప్పారు. ఈ ఏడాదిలో బెజవాడలో పారిశ్రామికవేత్తల సదస్సు కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.