యుపి ఫలితాలు: జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు

కాంగ్రెసు కేంద్రంలో అధికారంలోకి రావడానికి 2009లో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించింది. ఈసారి కూడా అదే పరిస్థితి రావచ్చు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు యుపి ఫలితాలపై వారి ప్రతిస్పందనను బట్టి అర్థమవుతోంది. ములాయం సింగ్కు ఫోన్ చేసి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రజలు యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జగన్ అన్నారు. దాంతో ఆగకుండా ములాయం సింగ్కు, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. వీరిద్దరిలో ఎవరు జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనేది ఎన్నికల తర్వాతనే తేలే అవకాశం ఉంది. అయితే, చంద్రబాబు మొదటి నుంచి కూడా ఆ గాడిలో ఉన్నారు.
సిపిఎం, సిపిఐ, ఇతర లౌకిక పార్టీలు కలిసి మూడో ఫ్రంట్కు ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. మరోసారి దేశంలోని సోషలిస్టులు ఏకమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీలతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడియంకె ఈ రాజకీయ ప్రయోగంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. జయలలిత కాంగ్రెసు పార్టీతో అంటీముట్టనట్లే ఉంటున్నారు. తమిళనాడులో డిఎంకె కాంగ్రెసుతో కొనసాగుతుండగా అన్నాడియంకె విడిగానే ఉంది. యుపిఎలోని కొన్ని పార్టీలు ఈ తృతీయ కూటమిలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సోనియా, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెసు మరింత బలహీనపడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ స్థితిలో భాగస్వామ్య పక్షాలు కొత్త కూటమిని ఆహ్వానించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications