తెలంగాణలో కిరణ్, చంద్రబాబు: కోవూరులో జగన్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి విజయం కోసం మహబూబ్నగర్లో ప్రసంగించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్పై మునుపెన్నడూ లేని విధంగా విమర్సనాస్త్రాలు సంధించారు. కెసిఆర్ ఉప ఎన్నికలతో పబ్బం గడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాగా, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ప్రజా చైతన్యాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇకపోతే, వైయస్ జగన్ కోవూరులో తెరిపిలేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించడానికి కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందని ఆయన చెప్పారు.