చిరంజీవి సీట్లో హోరాహోరీ: పార్టీల అభ్యర్థులు రెడీ
ఇదిలావుంటే, తిరుపతి సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. తమ పార్టీ తరఫున మోహన్ బాబును పోటీకి దించాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. మోహన్ బాబు కాని పక్షంలో కందాటి శంకర రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ శంకర రెడ్డిని పోటీకి దించినా తిరుపతిలో విజయం సాధించడానికి మోహన్ బాబు సహకారం తీసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారని అంటున్నారు. తిరుపతిలో మోహన్ బాబుకు మంచి పలుకుబడి ఉంది. ఇమేజ్ కూడా పనికి వస్తుంది.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేసి చిరంజీవిపై ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. దాదాపుగా మూడు పార్టీల అభ్యర్థులు కూడా తిరుపతి సీటుకు ఖరారైనట్లు చెబుతున్నారు.